రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి: సోము వీర్రాజు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నేతలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఇక్కడి ఆర్ట్స్ కాలేజీని పరిశీలించారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను సీఎం జగన్ కు లేఖ రాస్తానని సోము వీర్రాజు వెల్లడించారు. 

క్రికెట్ స్టేడియం నిర్మాణం సరికాదని, ఆర్ట్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా మార్చితే నూతన భవనాలు ఎక్కడ నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కళాశాలలో ల్యాబొరేటరీలు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతుంటే, కళాశాలకు చెందిన స్థలాన్ని క్రికెట్ స్టేడియంకు ఇవ్వడమేంటని అన్నారు. 

కాలేజీ అనేది బహిరంగ ప్రదేశం కాదని, విద్యార్థులకు నిలయం అని సోము వీర్రాజు పేర్కొన్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, దీనిపై ఎంతదాకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

Somu Veerraju
Rajahmundry
Arts College
Cricket Stadium
BJP

More Telugu News